ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. బారాషహీద్ దర్గాకు పోటెత్తిన భక్తజనం..
ABN , Publish Date - Jun 26 , 2026 | 07:59 AM
నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద ప్రతిష్ఠాత్మక రొట్టెల పండుగ ఈరోజు (శుక్రవారం) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు భక్తిశ్రద్ధల నడుమ సంధల్ మాల్ కార్యక్రమంతో వేడుక మొదలైంది.
నెల్లూరు: నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద ప్రతిష్ఠాత్మక రొట్టెల పండుగ ఈరోజు (శుక్రవారం) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు భక్తిశ్రద్ధల నడుమ సంధల్ మాల్ కార్యక్రమంతో వేడుక మొదలైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగకు భారీగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దర్గా పరిసరాలు, ప్రధాన రహదారులు, స్వర్ణాల చెరువు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 900 మంది కార్మికులను అధికారులు ప్రత్యేకంగా నియమించారు. మరోవైపు భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు జిల్లా పోలీసులు. మొత్తం 1,743 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 26 డ్రోన్లు, 96 సీసీ కెమెరాల ద్వారా దర్గా పరిసర ప్రాంతాలపై నిరంతర నిఘా పెట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల హెచ్చరించారు.
భక్తుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ 69 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మహిళలకు స్త్రీశక్తి, దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకాల సౌకర్యాలను ఈ ప్రత్యేక సర్వీసుల్లో అమలు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు సర్కార్ ఆదేశాల మేరకు పండుగ ముగిసే వరకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్
మురికి నీళ్లలో ఆకు కూరల్ని కడిగిన వ్యాపారి.. మరీ ఇంత దారుణమా..