హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Mar 25 , 2026 | 08:37 AM
నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
నంద్యాల, మార్చి25: నంద్యాల జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైరు పేలి అదుపుతప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో వెళ్తుండగా, నంద్యాల సమీపంలో హైవే పై ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో టైరు పేలిపోయింది. అప్పటికే బస్సు వేగంగా ఉండటంతో డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం అదుపులోకి రాలేదు. దీంతో బస్సు రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న పొలాల్లోకి వేగంగా దూసుకెళ్లింది
అకస్మాత్తుగా బస్సు అదుపు తప్పడంతో లోపల ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి ఒకచోట స్థిరంగా ఆగిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఒకవేళ బస్సు గనుక బోల్తా పడి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాలలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టైరు పేలడం వల్ల జరిగిందా? బస్సు నిర్వహణ లోపం ఉందా లేదా అది వేగం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విజయవాడ ఉగ్ర లింక్ కేసులో మరొకరు అరెస్ట్
పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు!