ఓపీఎస్తోనే ఉద్యోగులకు భరోసా: ఏపీఎస్టీఏ
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:14 AM
పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది.
విజయవాడ: పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది. పెన్షన్ ప్రభుత్వ దానం కాదని ఉద్యోగి జీవిత కాల ప్రజాసేవకు లభించే చట్టబద్దమైన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
సీపీఎస్ అనేది నిర్దిష్ట విరాళాల విధానమని, ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ లభిస్తుందో ముందుగానే నిర్ధారించలేమని వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం ఇదేనని స్పష్టంచేశారు. కేవలం నియామక తేదీ ఆధారంగా ఒకరికి ఓపీఎస్, మరొకరికి సీపీఎస్ వర్తించడం.. సమాన పనికి సమాన సామాజిక భద్రత అనే సూత్రానికి అనుగుణంగా లేదన్నారు. దీనివల్ల నిర్దారిత పెన్షన్, డియర్ నెస్ రిలీఫ్, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని ఆవేదన వ్యక్తంచేశారు.