నారా లోకేష్ ఆత్మీయ కలయిక.. గుంటూరు-విజయవాడ నేతల కుటుంబాలతో విందు..
ABN , Publish Date - Feb 14 , 2026 | 07:38 PM
మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు..
అమరావతి, ఫిబ్రవరి 14: రాజకీయ వ్యూహాలు, అసెంబ్లీ బడ్జెట్ చర్చల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. మంత్రి నారా లోకేష్ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని.. ఆయన నివాసంలో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
రాజకీయాలకు అతీతంగా..
ఈ సమావేశం వనభోజనాల తరహాలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాజకీయ చర్చలకు తావులేకుండా, కేవలం కుటుంబ విషయాలు, పిల్లల చదువులు, వారికి గల క్రీడాభిలాషపై మాట్లాడుకున్నారు.
సమావేశానికి వచ్చిన చిన్నపిల్లలతో లోకేష్ సరదాగా కబుర్లు చెబుతూ గడిపారు. 'చదువు, కెరీర్ ఒక్కటే జీవితం కాదు.. పిల్లలు క్రీడలను కూడా కెరీర్గా ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి' అని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు.

చేనేతకు మంగళగిరి బ్రాండింగ్..
తన నియోజకవర్గమైన మంగళగిరిలోని చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు లోకేష్ ప్రతి అవకాశాన్నీ వాడుకుంటున్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా మంగళగిరి చేనేత చీరలను కానుకగా అందజేసి తన నియోజకవర్గ బ్రాండింగ్ను చాటుకున్నారు.
పనుల పురోగతిపై రిపోర్ట్ కార్డులు..
కేవలం విందుకే పరిమితం కాకుండా.. బాధ్యతాయుతమైన నాయకుడిగా లోకేష్ మరో అడుగు వేశారు. గతంలో ఆయా నియోజకవర్గాల నాయకులు తనకు ఇచ్చిన వినతులపై (Representations) తాజా పరిస్థితి ఏంటి? పనులు ఏ దశలో ఉన్నాయి? అనే అంశాలతో కూడిన స్టేటస్ రిపోర్టులను స్వయంగా ఆయా నాయకులకు అందజేశారు.
ఈ ఆత్మీయ కలయికకు హాజరైన నేతలు:
గుంటూరు ఎంపీ & కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (తెనాలి-జనసేన)
ఎమ్మెల్యేలు: తెనాలి శ్రావణ్ కుమార్ (తాడికొండ)
ధూళిపాళ్ల నరేంద్రకుమార్ (పొన్నూరు)
బూర్ల రామాంజనేయులు (ప్రత్తిపాడు)
గల్లా మాధవి (గుంటూరు వెస్ట్)
నసీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్)
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
తంగిరాల సౌమ్య (నందిగామ),
శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట)
వసంత వెంకట కృష్ణప్రసాద్ (మైలవరం)
కొలికపూడి శ్రీనివాసరావు (తిరువూరు)
బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్)
గద్దె రామమోహన రావు (విజయవాడ ఈస్ట్)
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వీరిలో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం..
ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్.. ఏం జరిగిందంటే.?