Boyakonda: బోయకొండలో అవకతవకలపై విచారణ
ABN , Publish Date - Jan 11 , 2026 | 02:28 AM
బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు.
చౌడేపల్లె, జనవరి10(ఆంధ్రజ్యోతి): బోయకొండ పుణ్యక్షేత్రంలో నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ చేపట్టినట్లు కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆలయంలో హుండీ నిధుల్లో అవకతవకలు, దేవదాయ శాఖ కమిషనర్ అనుమతులు లేకుండా 30మందిని నియమించడం,పొట్టేళ్ల తలకాయల రూ.2వేల వరకూ విక్రయించడం, కొండ కింద నిర్వాసితులకు నష్ట పరిహరం చెల్లింపులో అవకతవకలు లాంటి అంశాలపై రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరనాయుడు ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారన్నారు. వాటికి ఆధారాలు, సీసీ ఫుటేజీలు కూడా ఇచ్చారన్నారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో తాను విచారణ చేపట్టినట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. పాల ఏకిరి కార్పోరేషన్ చైర్మన్ నాగేశ్వరనాయుడు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పలు ఆలయాలను దోచుకున్నారని, విధ్వంసం చేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్దాలని కూటమి ప్రభుత్వం సంకల్సించిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.