ఉగాదికి జాబ్ క్యాలెండర్.. జాబితాలోనే డీఎస్సీ పోస్టులు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:58 PM
ఏపీ శాసనసభలో నేడు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖ, నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, విద్యాసంస్థల బలోపేతంపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చింది.
అమరావతి, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా 8వ రోజు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ, నిరుద్యోగుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు.
జాబ్ క్యాలెండర్, డీఎస్సీపై ప్రకటన
రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. విశేషమేమిటంటే, ఈ జాబ్ క్యాలెండర్లోనే డీఎస్సీ(DSC) పోస్టులను కూడా చేర్చనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇది ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేలాది మంది అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
కేజీబీవీ పాఠశాలలపై చర్చ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(KGBV) పనితీరుపై ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎమ్మెల్యే మురళీ మోహన్ పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీలో కేజీబీవీ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ కూడా అందిస్తున్నారని, ఇక్కడ పనిచేస్తున్న వారికి ఎంటిఎస్(MTS) అమలు చేయాలని, రెగ్యులర్ ప్రిన్సిపాళ్లను నియమించాలని కోరారు.
దీనికి మంత్రి నారా లోకేశ్ సమాధానమిస్తూ.. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో కేజీబీవీలకు ఎక్కువ డిమాండ్ ఉందని, అడ్మిషన్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని తెలిపారు. జీతాల పెంపుదలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని, కేంద్రం సహకారం అందిస్తే మరిన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
పాలిటెక్నిక్, ఐటీఐ విద్య బలోపేతం
ఉన్నత విద్యలో ఇంజనీరింగ్తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐల ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ఉత్తరాంధ్రలో ఏర్పడుతున్న పారిశ్రామిక ఎకో సిస్టమ్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మరమ్మతులను 'క్లస్టర్ బేస్డ్ అప్రోచ్' ద్వారా వచ్చే ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి:
కాపీ కొడుతూ దొరికిపోయి.. ఇన్విజిలేటర్పై పిడిగుద్దులు
వరుడిని చూడగానే ట్రాన్స్జెండర్లకు డౌట్! ఆ తరువాత..