Fatal Accident: ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్త హత్య
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:21 AM
ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య, అందుకు సహకరించిన ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు ..
రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భార్య స్కెచ్
మృతుడి కుటుంబీకుల అనుమానంతో కుట్ర స్పష్టం
భువనగిరి జిల్లా మోటకొండూరులో దారుణం
ముగ్గురు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు
యాదగిరిగుట్ట రూరల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రియుడు, తమ్ముడితో కలిసి భర్తను హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన భార్య, అందుకు సహకరించిన ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం భువనగిరి డివిజన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన వస్తుపుల స్వామి(38) భువనగిరిలో పనులు ముగించుకుని స్నేహితుడు వీరబాబుతో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్పై గ్రామానికి బయలుదేరాడు. రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారి కాటేపల్లిలోని బ్రిడ్జి దాటగానే వెనక నుంచి వచ్చిన ఓ కారు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్వామి మృతిచెందగా, వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై అనుమానం ఉందని స్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. స్వామి భార్య స్వాతి ఇందుకు సూత్రధారిగా గుర్తించి ఆమెను, మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
హత్యకు పథకం వేశారిలా..
తుర్కపల్లి మండలం పల్లెపాడుకు చెందిన గుంటి సాయికుమార్ భువనగిరిలోని ఓ మార్బుల్ దుకాణంలో పనిచేసేవాడు. అక్కడికి సమీపంలోని ఓ మోటారు దుకాణంలో స్వాతి పనిచేస్తుండేది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు, స్వామి తన బావమరిది మహేశ్ మొదటి భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో స్వామిపై మహేశ్ పగ పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసి స్వాతి తన భర్తను పలుమార్లు హెచ్చరించింది. దీంతో స్వామి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక తనకు పరిచయమున్న సాయికుమార్, తమ్ముడు మహేశ్కు విషయం చెప్పింది స్వాతి. భర్తను ఎలాగైనా కడతేర్చాలని నిర్ణయించుకుంది. స్వామి పని నిమిత్తం ఆదివారం భువనగిరికి వెళ్లాడు. దీంతో సాయికుమార్ భువనగిరి తాతానగర్కు చెందిన తన మిత్రుడు రామలింగస్వామి సాయంతో తెలిసిన వ్యక్తి ద్వారా కారును అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ కారులో స్వామిని అనుసరించారు. మిత్రుడు మద్దికుండ వీరబాబుతో కలిసి ఆదివారం రాత్రి బైక్పై రాయగిరి నుంచి స్వామి పల్లెర్లకు బయలుదేరాడు. మోటకొండూరు మండలంలోని కాటేపల్లి పరిసర ప్రాంతానికి చేరుకోగానే బైక్ను వెనుక నుంచి కారుతో ఢీకొట్టిన సాయికుమార్ సుమారు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. స్వామి మృతిపై అనుమానం ఉందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం ప్రధాన నిందితులైన సాయికుమార్, స్వాతి, ఆమె తమ్ముడు పొట్టెపాక మహేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు చీమల లింగస్వామి పరారీలో ఉన్నాడు. నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు.