Tummala: అవసరానికి తగిన విధంగా ఎరువుల సరఫరా
ABN , Publish Date - Feb 22 , 2025 | 04:53 AM
రాష్ట్రంలో రైతుల అవసరానికి తగిన విధంగానే ఎరువుల సరఫరా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో యాసంగి సీజన్ ఎరువుల లభ్యత, సరఫరాపై శాఖ డైరక్టర్ బి.గోపితో చర్చించారు.
రైతులెవరూ ఆందోళన చెందొద్దు: తుమ్మల
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల అవసరానికి తగిన విధంగానే ఎరువుల సరఫరా ఉందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో యాసంగి సీజన్ ఎరువుల లభ్యత, సరఫరాపై శాఖ డైరక్టర్ బి.గోపితో చర్చించారు. గడిచిన ఐదేండ్లలో 2022-23 యాసింగి సీజన్లో 9.80లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడకం ఉందని, దానిని ప్రామాణికంగా తీసుకుని ఈ సీజన్లో అంతకంటే ఎక్కువగా యూరియా అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మంత్రికి ఈ సందర్భంగా డైరక్టర్ తెలిపారు. గతేడాది అక్టోబరు 1 నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి 6.73లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని వివరించారు.
ఈ ఫిబ్రవరి నెలలోనే 45వేల మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చిందన్నారు. అయినప్పటికీ ఎరువులను జాగ్రత్తగా సరఫరా చేస్తున్నామని వివరించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో రాష్ట్రానికి రావాల్సిన యూరియాను వెంటనే ఇతర కంపెనీల ద్వారా సరఫరా చేయడానికి కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, రైతులు అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని సూచించారు.