Tummala: హైదరాబాద్లో మెగా వ్యవసాయ మార్కెట్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:05 AM
హైదరాబాద్ సమీపంలోని కొహెడలో రూ.2వేల కోట్లతో 400 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
2వేల కోట్లతో నిర్మాణం.. త్వరలో శంకుస్థాపన: తుమ్మల
ఖమ్మం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హైదరాబాద్ సమీపంలోని కొహెడలో రూ.2వేల కోట్లతో 400 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో ఈ మార్కెట్కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఖమ్మంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదానికి గురైన పత్తి మార్కెట్ను గురువారం మంత్రి తుమ్మల సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్ నిజామాబాద్తో పాటు ఇతర వ్యవసాయ మార్కెట్ల అబివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రానికి పసుపుబోర్డు మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపితే ఎంపీ అరవింద్కు అభ్యంతరం ఏమిటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
23న కొత్తగూడెంలో ఎయిర్పోర్టు స్థల పరిశీలన
కొత్తగూడెం: కొత్తగూడెంలో విమానాశ్రయ స్థల పరిశీలన కోసం ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం (ఏఏఐ) ఈ నెల 23న రానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడుతో మంత్రి తుమ్మల ఫోన్లో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పర్యటన కోసం చర్యలు తీసుకోవాలని కోరగా ఈ నెల 23న జిల్లాకు బృందాన్ని పంపించేలా చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.