Laddu Prasadam: మరింత నాణ్యంగా తిరుమల లడ్డూ!
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:13 AM
శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
రిలయన్స్ రిటైల్స్ సంస్థతో టీటీడీ ఒప్పందం
తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు ఎంతో పవిత్రంగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముడిసరుకుల ఎంపికలో అనుభవం కలిగిన రిలయన్స్ రిటైల్స్ సంస్థ ఇచ్చే సూచనల మేరకు నాణ్యమైన ముడిసరుకులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ మేరకు రిలయన్స్ సంస్థతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. ముడిసరుకుల ఎంపికలో అనుభవం కలిగిన రిలయన్స్ సంస్థ ఈ విషయంలో ఫ్రీ సర్వీస్ కింద ముందుకు రాగా, గత నవంబరులో టీటీడీ ఎంవోయూ చేసుకుంది.
ముడిసరుకుల కొనుగోళ్లను చివరిదశలో ఎంపిక చేసేందుకు ప్రత్యేక నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. కాగా, పది రోజులపాటు తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారం అర్ధరాత్రితో ముగిశాయి. దీంతో సోమవారం వేకువజాము నుంచి భక్తులకు సాధారణ దర్శనాలు మొదలయ్యాయి. పది రోజుల్లో 6,83,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. హుండీ ద్వారా రూ.34.43 కోట్ల ఆదాయం లభించింది.