Transport Department: రవాణా సేవలు భారం
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:57 AM
రవాణాశాఖ సేవలు మరింత భారంగా మారాయి. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ.. కొత్త ఫీజులను ప్రకటించింది. రవాణా శాఖ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే..
వాహన యాజమాన్య బదిలీకి రెండింతలు పెరిగిన రుసుము
గతంలో రూ.935.. ఇప్పుడు రూ.1,805
హైపొథికేషన్ ఫీజుపై రూ.1,000 బాదుడు
రూ.100కు పైనే పెరిగిన లెర్నర్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజులు
ప్రకటన లేకుండానే ఆన్లైన్లో కొత్త ధరలు
ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రవాణాశాఖ సేవలు మరింత భారంగా మారాయి. ప్రభుత్వం పలు సేవల ధరలను పెంచుతూ.. కొత్త ఫీజులను ప్రకటించింది. రవాణా శాఖ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే.. ఆదివారం ఉదయం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. అధికారులు చడీచప్పుడు కాకుండా రవాణాశాఖ వెబ్సైట్లో కొత్త ధరలను అప్డేట్ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా.. మరికొన్నింటికి భారం తడిసి మోపెడుకానుంది. ఉదాహరణకు.. లెర్నర్స్ లైసెన్స్కు గతంలో రూ.335 ఫీజు ఉండేది. దాన్ని తాజాగా రూ.440కి పెంచారు. రెండు కేటగిరీలు-- ద్విచక్రవాహనం, కారు లెర్నర్స్ లైసెన్స్ ఫీజు రూ.450 నుంచి రూ.585కు పెరిగింది. ఇక పర్మినెంట్ లైసెన్సుకు సంబంధించిన డ్రైవింగ్ టెస్టుకు గతంలో రూ.1,035 వసూలు చేసేవారు.
దాన్ని ఇప్పుడు రూ.1,135కు పెంచారు. వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో రూ.935 ఫీజు ఉండగా.. ఇప్పుడు రూ.1,805కు పెరిగింది. ఫైనాన్స్పై వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం(హైపొథెకేషన్) ఫీజు రూ.2,135గా ఉండేది. ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి.. రూ.3,135కు చేరుకుంది. రుణ బదిలీకి ఫీజు రూ.2,445 నుంచి రూ.2,985కి.. ఆటోరిక్షా డ్రైవింగ్ టెస్ట్ ఫీజు రూ.800 నుంచి రూ.900కు పెంచారు. గతంలో రవాణాశాఖ అధికారులు ఈ పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. సర్కారు అనుమతించడంతో ఇప్పుడు ఫీజులను పెంచినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి...
గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
కంబోడియా, థాయ్లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి