ఆర్కేవీవై కింద టార్గెట్ రూ.2273 కోట్లు!
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:51 AM
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, సంక్షేమ పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
ఢిల్లీలో మకాం వేసిన వ్యవసాయశాఖ అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, సంక్షేమ పథకాల నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’(ఆర్కేవీవై) పథకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి రూ. 2,273 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, డైరెక్టర్ డాక్టర్ గోపి, వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులు ఢిల్లీలో మకాంవేసి ఈ ప్రాజెక్టు నివేదికను సమర్పించి, ఆమోదింప చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
రాష్ట్రాలు తమ స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించటానికి కేంద్ర ప్రభుత్వంసౌలభ్యం కల్పించి ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసి 60:40నిష్పత్తిలో (కేంద్రం:రాష్ట్రం)నిధులు మంజూరు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బెడిసికొట్టడంతో ఈ పథకం రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది.