Urban Development: పట్టణాభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:57 AM
సుస్థిర పట్టణాభివృద్ధి సాధనే లక్ష్యంగా అన్ని మునిసిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది.
సెప్టెంబరు 10 వరకూ కార్యాచరణ
ఆస్తుల మదింపునకు భువన్ సర్వే
మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): సుస్థిర పట్టణాభివృద్ధి సాధనే లక్ష్యంగా అన్ని మునిసిపాలిటీల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ‘ఒక చర్య- ఒక మార్పు’ అనే నినాదంతో ‘ప్రజలే ముందు’ అన్న విధానంలో భాగంగా పట్టణాల అభివృద్ధికి బాటలు వేయనున్న ఈ ప్రణాళికను ఈ నెల రెండో తేదీ నుంచి సెప్టెంబరు పదో తేదీ వరకూ అమలు చేస్తారు. తొలి రోజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే సామర్థ్యం గల పట్టణాలను రూపొందించడమే ఈ ప్రణాళిక లక్ష్యమని రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రణాళిక అమలులో భాగంగా మునిసిపల్ రికార్డుల్లో ఉన్న తాగునీటి కనెక్షన్లతోపాటు కొత్త కనెక్షన్లను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇంటి పన్ను తక్కువ మదింపు చేసిన ఆస్తులను, అసలు పన్ను వేయని ఆస్తులను భువన్ సర్వే ద్వారా గుర్తించి వాటిపై సరైన ఆస్తి పన్ను వసూలు చేస్తారు.
గుంటూరులో రెండు కొవిడ్ కేసులు
గుంటూరు మెడికల్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని గుంటూరు నగరంలో సోమవారం రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే విజయలక్ష్మీ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటి వరకు తెనాలి, ఉండవల్లి ప్రాంతాల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా గుంటూరు నగర పరిధిలో కేసులు వెలుగుచూశాయి. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకొని వైద్యచికిత్స అందిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలతో వచ్చే వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీ సమీపంలో ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు చికిత్స నిమిత్తం బీ క్లాస్ వార్డులో 15 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు.