High Court: ఐఏఎంసీకి ఐదు ఎకరాలు కేటాయింపు సబబే
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:37 AM
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి ఐదు ఎకరాల భూమిని కేటాయించడం కేటాయించడం సరైన నిర్ణయమేనని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

కేసీఆర్ సర్కారు నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్థన
హైకోర్టుకు నివేదిక
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి ఐదు ఎకరాల భూమిని కేటాయించడం కేటాయించడం సరైన నిర్ణయమేనని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ప్రైవేటు ట్రస్టు అయిన ఐఏఎంసీకి రాయదుర్గంలో అత్యంత విలువైన ఐదెకరాల భూకి కేటాయించడంతోపాటు, నిర్వహణకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ సుజనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి వాదిస్తూ.. ఐఏఎంసీకి భూకేటాయింపు సరైనదే అని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి నగరంలో వ్యాపారాలను ప్రోత్సహించాలంటే ఐఏఎంసీ వంటి ఆర్బిట్రేషన్ సంస్థలు ఉండాలని తెలిపారు. ఇది ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయమని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.