Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్లకు రోల్ మోడల్.. తెలంగాణ
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:49 AM
బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు.
అందులో భాగం కావడం నా అదృష్టం
ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి భేటీలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. ‘మనమెంతో.. మనకంత’ అన్న రాహుల్గాంధీ నినాదాన్ని సమగ్రంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుందన్నారు. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు వీలుగా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాంటి చరిత్రాత్మక ఘట్టంలో తనకూ భాగస్వామ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బెంగళూరులో బుధవారం కర్ణాటక సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీసీ డిక్లరేషన్ను తాను ప్రతిపాదించానని, ఆ సభకు సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో బీసీ రిజర్వేషన్ కోసం రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డితోపాటు సైనికుడిలా పనిచేస్తున్నానన్నారు. సీఎం రేవంత్రెడ్డి అగ్రకులానికి చెందిన వారైనా బీసీ రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశాన్ని అక్టోబరు నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పార్టీ నేతలు వి.హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
సెంటిమెంట్ పేరిట ఎంతకాలం బతుకుతారు?
కేటీఆర్, హరీశ్పై ఆది శ్రీనివాస్ ధ్వజం
‘‘కృష్ణా, గోదావరి జలాలపై ఢిల్లీలో చర్చలు జరిగితే మీరెందుకు ఉలిక్కి పడుతున్నరు? అజెండాలో బనకచర్ల లేదని కుమిలిపోతున్నరా? ఇంకెంత కాలం తెలంగాణ సెంటిమెంట్ పేరిట బతుకుతారు?‘‘ అంటూ కేటీఆర్, హరీశ్రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. చేపల పులుసు తిని గోదావరి జలాలను రాసిచ్చినట్లు, జగన్ను ప్రగతి భవన్కు పిలిచి కృష్ణా జలాలను తాంబూలంగా ఇచ్చినట్లు తామూ చేస్తామనుకున్నారా? అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి