రాష్ట్రంలో యూరియా కొరత లేదు:తుమ్మల
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వారంలో 81,800 మెట్రిక్ టన్నులు వస్తుందన్న మంత్రి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వారంలో మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 8.54 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిఉండగా, 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని వివరించారు.
అయినా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మార్క్ఫెడ్ వద్ద ఉంచిన 3.08 లక్షల మెట్రిక్ టన్నుల్లో అవసరం మేరకు అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని కోరినట్టు వివరించారు.. మరోవైపు..రాష్ట్రంలో 1.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ సంచాలకుడు ఒక ప్రకటనలో కోరారు.