SC Categorization : వర్గీకరణకు సై
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:00 AM
రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డు కులాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ, ఉప కులాలకు 9% రిజర్వేషన్లు ఖరారు చేసింది. మాల, ఉప కులాలకు 5%; అత్యంత వెనకబడిన బుడ్గ జంగం తదితర కులాలకు ఒక శాతం రిజర్వేషన్ను కేటాయించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను తొలుత క్యాబినెట్లో,
మాదిగలకు 9%.. మాల, ఉప కులాలకు 5%.. ఇతరులకు 1%క్రీమీలేయర్ సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వం
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను అమలు
చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం.. సుదీర్ఘ చర్చ
వారం పది రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్కు కసరత్తు
సుప్రీం తీర్పిచ్చిన గంటన్నరలోనే సీఎం స్పందించారు: దామోదర
రాష్ట్రంలో ఎస్సీల్లోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను వర్గీకరించాలని జస్టిస్ అక్తర్ కమిషన్ నివేదిక సమర్పించింది. వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఏకసభ్య కమిషన్ ఎస్సీల్లోని 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి 1:9:5 నిష్పత్తిలో రిజర్వేషన్లను అమలు చేయాలని సిఫారసు చేసింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గాలంద రికీ మేలు జరుగుతుంది.
- శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ పార్టీ కులగణనపై అవాస్తవాలు మాట్లాడి.. వాకౌట్ అంటే ఎలా? బీఆర్ఎస్ పాలనలో బీసీలకు చేసిందేమీ లేదు. వారు చేసిన సమగ్ర సర్వేలో ఓసీ జనాభా 21.55 శాతమని చెప్పారు. తాజా కులగణనలో 15.79 శాతంగా తేలింది. బీఆర్ఎస్ వాళ్లు సభలో అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాజకీయ రిజర్వేషన్లే కాకుండా ఉపాధి, ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం చేయడానికే మా ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది.
- మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డు కులాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ, ఉప కులాలకు 9% రిజర్వేషన్లు ఖరారు చేసింది. మాల, ఉప కులాలకు 5%; అత్యంత వెనకబడిన బుడ్గ జంగం తదితర కులాలకు ఒక శాతం రిజర్వేషన్ను కేటాయించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికను తొలుత క్యాబినెట్లో, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. తద్వారా, సుప్రీం తీర్పు అనంతరం ఎస్సీలను వర్గీకరించి, రిజర్వేషన్లను ఖరారు చేయడంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కమిషన్ సిఫారసు చేసినా.. వర్గీకరణలో క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయడం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఇచ్చిన తీర్పుపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు అదే రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలుకు తొలుత గత ఏడాది సెప్టెంబరు 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం అక్టోబరు 11న రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 8ని విడుదల చేసింది. వర్గీకరణపై సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ ప్రక్రియను నిర్వహించింది. ఫిబ్రవరి మూడో తేదీన మంత్రివర్గ ఉప సంఘానికి తన నివేదికను అందించింది.
కమిషన్ చెప్పిందే చేద్దాం..
ఎస్సీ ఉప కులాల్లో ఎవరిని ఏ గ్రూపులో చేర్చాలన్న అంశంపై సొంత నిర్ణయం వద్దని, ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన దానికే కట్టుబడి ఉందామని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముందు మంగళవారం కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశమైంది. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను అందులో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. మొదటి గ్రూప్లో 15 కులాలను, రెండో గ్రూప్లో 18, మూడో గ్రూప్లో 26 కులాలను చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. వీటిలో ఏ కులాన్నైనా ఒక గ్రూపు నుంచి మరో గ్రూపునకు మార్చాలా? అన్న దానిపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అయితే, ఈ అంశంలో వేలు పెట్టకూడదని, ఏకసభ్య కమిషన్ సిఫార్సుకే కట్టుబడి ఉండాలని చివరకు నిర్ణయించింది.
మూడు గ్రూపులు..
క్యాబినెట్ ఆమోదం తర్వాత జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. నివేదికలోని సిఫారసుల ప్రకారం ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వర్గాలు, జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 59 కులాలను వర్గీకరించినట్లు తెలిపింది. దాని ప్రకారం.. అత్యంత వెనకబడిన 15 కులాలను గ్రూప్-1గా పేర్కొంది. ఎస్సీల్లో వారి జనాభా 3.288 శాతం. వీరికి 1 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇక, మాదిగ, 18 ఉప కులాలను గ్రూప్-2గా పేర్కొంది. వాటి జనాభాను 62.748 శాతంగా పేర్కొంది. ఈ కులాల్లో ఒక్క మాదిగల జనాభా శాతమే 61.967 శాతం (32,33,642)గా పేర్కొంది. ఈ గ్రూపులోని మాదిగ, ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్ను ఖరారు చేసింది. ఇక, మాల, 26 ఉప కులాలను కలిపి గ్రూప్-3గా వర్గీకరించింది. ఎస్సీల్లో వారి జనాభాను 33.963 శాతంగా పేర్కొంది. వీరిలోనూ ఒక్క మాలల జనాభానే 29.265 శాతం (15,27,143)గా వివరించింది. మాల, ఇతర ఉప కులాలకు కలిపి 5 శాతం రిజర్వేషన్ను కేటాయించింది.
క్రీమీలేయర్కు నో
ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్తోపాటు క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ సిఫారసు చేసింది. దీనితో కలిపి మొత్తం నాలుగు సిఫారసులు చేసింది. వీటిలో క్రీమీలేయర్ మినహా మిగిలిన మూడు సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. క్రీమీలేయర్ సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. క్రీమీలేయర్ అంటే ఇప్పటికే వివిధ రంగాలు, వివిధ రూపాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందిన వారి రెండో తరానికి ఆ ప్రయోజనాన్ని మినహాయించడం. దీని ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు సహా ప్రజా ప్రతినిధులతోపాటు గ్రూప్-1 సర్వీసుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్గా పరిగణించాలని సూచించింది. ఈ వ్యక్తుల రెండో తరం రిజర్వేషన్ల ప్రయోజనం పొందకుండా మినహాయించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, నివేదికలోని రెండో సిఫారసు.. ఉద్యోగ ఖాళీల భర్తీల్లో ప్రాధాన్య క్రమాన్ని పాటించడం. దీని ప్రకారం.. ఉద్యోగ ఖాళీల భర్తీ క్రమంలో గ్రూప్-ఐలో గుర్తించిన కులాలతో ఆ ఖాళీలు భర్తీకాకపోతే.. వాటిని తదుపరి ప్రాధాన్య గ్రూప్ అయిన రెండో గ్రూప్లోని కులాల ద్వారా భర్తీ చేయాలి. అప్పటికీ ఆ పోస్టులు భర్తీ కాకపోతే.. ఆ తర్వాత ఉన్న గ్రూప్-3లోని కులాల ద్వారా భర్తీ చేయాలని సిఫారసు చేసింది. ఒకవేళ, మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలని పేర్కొంది. మూడో సిఫారసు కింద.. ఈ మూడు గ్రూపుల వారికీ రోస్టర్లను సూచించింది. దాని ప్రకారం గ్రూప్-1కు 7 రోస్టర్ పాయింట్లు, గ్రూప్-2లో ఉన్నవారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 పాయింట్లను, గ్రూప్-3లో ఉన్న వారికి 22, 41, 62, 77, 91 చొప్పున రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది.
నో కామెంట్ నివేదికపై ఇప్పుడేమీ మాట్లాడను
‘ఆంధ్రజ్యోతి’తో మంద కృష్ణ మాదిగ‘‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై ఇప్పుడేమీ మాట్లాడను’’ అని ఎమ్మార్పీయస్ అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదిక, కులాల వారీ రిజర్వేషన్లపై కృష్ణ మాదిగ అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఈ విషయమై ఇప్పుడేమీ మాట్లాడనంటూ.. ‘నో కామెంట్’ అన్నారు. సమగ్ర సమాచారంతో అన్ని వివరాలను బుధవారం వెల్లడిస్తానని చెప్పారు. ఆయన బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
వారం, పది రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్
రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఎస్సీ ఉప కులాలను మూడు భాగాలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర శాసనసభ, మండలి మంగళవారం ఆమోదించిన తీర్మానం ఆధారంగా దీనిని విడుదల చేయనుంది. వర్గీకరణ అమలుకు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అది పూర్తయిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియకు వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత.. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకూ కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తు పూర్తై నోటిఫికేషన్లు విడుదలైతే.. పాతికేళ్ల తర్వాత రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న ఉద్యోగాలు ఇవే కానున్నాయి.
గాంధీ భవన్లో సంబరాలు పాల్గొన్న మహేశ్ గౌడ్, సంపత్కుమార్
హైదరాబాద్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ఆమోదం పొందుతున్న సమయంలో గాంధీ భవన్లో మంగళవారం పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. బాణసంచా కాల్చి, సీట్లు పంచుకున్నారు. డప్పు వాయిద్యాలతో గాంధీభవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన కాంగ్రెస్ మార్కు విజయాలన్నారు. ఎస్సీలు, బీసీల కోసం పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కేటీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కాగా, కులగణన సర్వే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్టీ బీసీ నేతలూ గాంధీ భవన్లో సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
పూర్తి నివేదిక వెల్లడి ఎప్పుడు?
ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్టీలు.. ప్రజలు
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన నివేదికలోని పూర్తి వివరాలు ఎప్పుడు తెలుస్తాయా అని రాజకీయ పార్టీలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. కులగణన నివేదికలో రాష్ట్రంలో ఉన్న కులాలు, వాటి జనాభా, శాతం వివరాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. ఏ కులం వారికి ఎంతమేర అవకాశాలు దక్కాయనే వివరాలను బయటపెట్టలేదు. అయితే కులాల వారీ లెక్కలను కూడా అవసరమైతే బయటపెడతామంటూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ఆ నివేదిక కూడా బయటకు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల్లోని వారికి ఎవరెవరికి ఎంతమేర ఉద్యోగాలు సహా వివిధ అంశాల్లో లబ్ధి జరిగిందన్నది తెలియనుంది. కాగా బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేపట్టింది. ఆ తరువాత పూర్తి నివేదికను బహిర్గతం చేసింది. తొలుత మొత్తం జనాభా వారీగా, బీసీల వివరాలను వెల్లడించింది. ఆ తరువాత పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచితే అన్ని వివరాలపై స్పష్టత వస్తుందనే చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో బీసీల్లోనూ ఏ, బీ, సీ, డీ, ఈలుగా పలు కేటగిరీలున్నాయి. వీటిల్లో ఎవరు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు, ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు నివేదిక బహి ర్గతమైతే తేలనున్నాయి. అందులోని అన్ని వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.




ఈ వార్తలు కూడా చదవండి..
అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News