FIFA: తెలంగాణ ఫిఫా.. మరో రెండు ఫుట్బాల్ అకాడమీల ప్రకటన!
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:25 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ నెల 8,9న జరగనుంది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు ఫుట్బాల్ అకాడమీల ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, డిసెంబర్ 2: భారత ఫుట్బాల్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీపై మరో కీలక అడుగు ముందుకు పడనుంది. దీనికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదిక కానుంది. ఈ నెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న సదస్సులో.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు సంబంధించిన ప్రధాన భాగస్వామ్యాలను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడాకారుల అభివృద్ధికి వీలుగా రెండు కొత్త FIFA-AIFF ఫుట్బాల్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ అకాడమీలు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF), అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (FIFA) సహకారంతో ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే హైదరాబాద్లో దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చర్యలు తెలంగాణను క్రీడలకు ముఖ్య కేంద్రంగా మార్చడానికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిభావంతులను అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ అకాడమీలు ఎందుకంటే..?
రాష్ట్రంలో అట్టడుగు స్థాయి నుంచి ఫుట్బాల్ ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఈ అకాడమీలు కృషి చేస్తాయి. ఈ అకాడమీల ద్వారా క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ లభిస్తుంది. కాగా ఇదివరకే హైదరాబాద్లో బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి FIFA టాలెంట్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదనంగా రానున్న ఈ రెండు అకాడమీలు రాష్ట్రంలో ఫుట్బాల్ వాతావరణాన్ని మరింత పటిష్టం చేస్తాయని భావిస్తున్నారు. ఈ కీలక ప్రకటన ద్వారా తెలంగాణను క్రీడలకు ముఖ్య కేంద్రంగా మార్చడంతో పాటు, క్రీడల ద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ఈ సమ్మిట్ దోహదపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి:
71ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్
సబ్వేలో సడెన్గా ఆగిపోయిన చెన్నై మెట్రో రైలు.. ట్రాక్స్ వెంబడి ప్రయాణికుల నడక