పాముకాటు చికిత్సలకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:34 AM
పాము కాటు సమస్య దేశమంతటా ఉందని, దీని నివారణకు ఏవైనా చర్యలు తీసుకోండని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తగిన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందించే విషయమై రాష్ట్రాలతో చర్చించాలని తెలిపింది.
కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ, జనవరి 27: పాము కాటు సమస్య దేశమంతటా ఉందని, దీని నివారణకు ఏవైనా చర్యలు తీసుకోండని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తగిన వైద్య సదుపాయాలు, చికిత్సలు అందించే విషయమై రాష్ట్రాలతో చర్చించాలని తెలిపింది. పాముకాట్లు ప్రజారోగ్య సంక్షోభంలాంటిదేనని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దీనిపై అఫిడవిట్లు సమర్పించేందుకు రాష్ట్రాలకు ఆరు వారాల సమయం ఇచ్చింది. దేశంలో పాము కాటు కేసులు అధికంగా ఉన్నందున తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్పై జరిపిన విచారణ సందర్భంగా కేంద్రానికి ఈ సూచన చేసింది.