Supreme Court: ఎమ్మెల్సీల నియామకంపై.. ఫిబ్రవరి 12న తుది వాదనలు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:40 AM
తెలంగాణ ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి ఫిబ్రవరి 12న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి ఫిబ్రవరి 12న తుది వాదనలు వింటామని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. కేసీఆర్ సర్కారు హయాంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించగా.. అప్పటి గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీంతో.. శ్రవణ్, సత్యనారాయణ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు గత ఏడాది జనవరి 13న కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించడం.. దీనిపై శ్రవణ్, సత్యనారాయణ మరోమారు హైకోర్టును ఆశ్రయించడం.. కోర్టు ఆ నియామకాలను రద్దుచేయడం తెలిసిందే..!
ఆ తర్వాత ప్రభుత్వం మరోమారు కోదండరాం, ఆమిర్ అలీఖాన్ పేర్లను పంపంగా.. గవర్నర్ ఆమోదించడంతో వారిద్దరూ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 4న శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ గవర్నర్ కార్యాలయం సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం ఈ రెండు పిటిషన్లపై తుది వాదనలను ఫిబ్రవరి 12న వింటామని స్పష్టం చేసింది.