Telangana: అసెంబ్లీ స్పీకర్కు ‘సుప్రీం’ నోటీసులు
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:50 AM
స్పీకర్ కోణంలో తగినంత సమయమంటే ఇంకెంత అంటూ మరోసారి నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.

‘ఫిరాయింపుల’పై 22లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం.. ఐదేళ్లు పూర్తయ్యే వరకూ వాయిదా వేస్తూ ఉంటారా?
తగినంత సమయాన్ని కోర్టు నిర్ణయించాలా? వద్దా?
‘తగినంత సమయం’పై మరోసారి సుప్రీం అసహనం
స్పీకర్ కార్యాలయానికి నోటీసులు అందలేదన్న సింఘ్వీ
స్పీకర్ సహా ప్రతివాదులందరికీ నోటీసులిచ్చిన కోర్టు
తదుపరి విచారణ 25కు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ కోణంలో తగినంత సమయమంటే ఇంకెంత అంటూ మరోసారి నిలదీసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, రాష్ట ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీలోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్సలో చేరారని, వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ మూడింటినీ కలిపి మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్మసీ్హల ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు, న్యాయవాది మోహిత్ రావు, స్పీకర్ కార్యాలయం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహత్గీ హాజరయ్యారు.
ఏడాదవుతున్నా చర్యల్లేవు..
తొలుత ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో తొలిసారి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించాం. ఆ తర్వాత జూన్లో రిట్ పిటిషన్ వేశాం. సుమారుగా ఏడాది కావస్తోంది. నేటికీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీఫాంపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు. మిగతా వాళ్లు ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇది పార్టీ ఫిరాయింపు కాకపోతే మరేమిటి? దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాం. సింగిల్ బెంచ్ విచారించింది. తగిన సమయం అంటే ఎంతో ఖరారు చేయాలని ఆదేశించింది. దీనికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. హైకోర్టు నిర్ణయంపై స్పీకర్ కార్యాలయం అప్పీల్కు వెళ్లగా, సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. కానీ, నేటికీ తగిన సమయం అంటే ఎంతో చెప్పలేదు. స్పీకర్ ‘తగిన సమయం’పై సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చు’’ అని తెలిపారు.
అలాంటి నిబంధన ఏమీ లేదు..
అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఫిరాయింపులపై గత ఏడాది జూలై మొదటి వారంలో స్పీకర్కు ఫిర్యాదు చేశారని, అదే నెల 9 నాటికే కోర్టులో పిటిషన్ కూడా వేశారని చెప్పారు. ఫిర్యాదుకు, పిటిషన్కు మధ్య నిర్దిష్ట గడువు ఉండాలని నారిమన్ తీర్పు ఉందని గుర్తుచేశారు. ‘‘ఫిర్యాదులు అందగానే స్పీకర్ స్పందించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారి సమాధానం రాగానే నిర్ణయం తీసుకుంటారు. నిర్దిష్ట సమయంలోనే నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనేమీలేదు. స్పీకర్ అనేది రాజ్యాంగ బద్ధంగా అత్య ంత ఉన్నత పదవి. అలాంటి స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం లేదు’’అని సింఘ్వీ వాదనలు వినిపించారు.ది.
ఏళ్ల తరబడి సాగదీస్తారా?
సింఘ్వీ వాదనలపై జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రం గా స్పందించారు. ‘‘మీ (స్పీకర్) దృష్టిలో తగినంత సమయం అంటే ఎంత? ఇలా ఏళ్ల తరబడి వాయిదాలు వేస్తూ ఉంటారా? ఐదేళ్లు పూర్తయ్యే వరకూ వాయిదాలతో కాలం వెళ్లదీస్తారా? సమయం విషయంలో న్యాయస్థానం కలగజేసుకోవాలా? వద్దా? నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉందా? లేదా? చట్టసభల గడువు ముగిసే వరకూ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తామంటే ఎలా? ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్ అన్నట్టు వ్యవహరిస్తామంటే సరికాదు’’ అని జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన సింఘ్వీ, రోహత్గీ.. తగిన సమయం, ఫిరాయింపులపై నిర్ణయానికి సంబంధించి స్పీకర్ కార్యాలయానికి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని చెప్పారు. దీంతో అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రతివాదులు అందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టుతోపాటు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ నేరుగా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులపై ఈ నెల 22లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను 25న నిర్వహిస్తామని తెలిపింది. దీన్ని అత్యంత ప్రాధాన్య కేసుగా పరిగణించి 25న తొలి కేసుగా లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిం
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.