Srisailam: ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో.. పరిష్కృతమైన నీటి లీకేజీ సమస్య
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:02 AM
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్కేంద్రం 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి అవుతున్న నీటి లీకేజీని నిలువరించేందుకు జెన్కో చర్యలు చేపట్టింది.
డ్రాఫ్ట్ట్యూబ్లో లీకేజీకి వెల్డింగ్
దోమలపెంట, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్కేంద్రం 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ నుంచి అవుతున్న నీటి లీకేజీని నిలువరించేందుకు జెన్కో చర్యలు చేపట్టింది. గత సెప్టెంబరు 18న మొదటి సారి పలచటి లీకేజీ బయటపడింది. డిసెంబరు 25 నుంచి నిరంతరాయంగా విద్యుదుత్పాదనతో పాటు, శ్రీశైలం డ్యాంలోకి నీటి మల్లింపు కొనసాగుతున్న క్రమంలో పంపు మోడ్లో టర్భైన్ వేగంగా తిరగడం వల్ల 1వ యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ స్లాబ్ నుంచి.. పలచటి లీకేజీ కాస్తా ధారలా మారింది. ‘‘వాటర్ లీకేజీతో ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రానికే ప్రమాదం’’ శీర్షికన ’ఆంధ్రజ్యోతి’ మెయిన్ ఎడిషన్లో కథనం ప్రచురితం కావడంతో..
అప్పటి జెన్కో సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్లు విద్యుత్కేంద్రంలో లీకేజీని పరిశీలించి, నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెన్కో ఇంజనీర్లు హైదరాబాద్కు చెందిన అనుభవం ఉన్న ఇంజనీరింగ్ కంపెనీ వారిని పిలిపించి.. 1వ యూనిట్ డ్రాఫ్ట్ ట్యూబ్ జీరో ఫ్లోర్ స్లాబ్కు కెమికల్ గ్రౌటింగ్ చేసి, తాత్కాలికంగా లీకేజీని నిలువరించారు. డ్రాఫ్ ట్యూబ్లో స్పెరల్కేస్ దగ్గర గతంలో పైపులకు చేసిన వెల్డింగ్ జాయింట్లో వచ్చిన క్రాక్ను గుర్తించేందుకు డ్రై పెన్డెంట్ టెస్టు(డీపీటీ) నిర్వహించారు. ఈ పరీక్షలో భాగంగా 60 మిల్లీ మీటర్ల మందం ఉండే పైపులో 200 మీటర్ల పొడవు జాయింట్లో పరిశీలన జరిపారు. 10ఎంఎం రంద్రాన్ని గుర్తించి, అక్కడా గ్లౌజింగ్, వెల్డింగ్ చేశారు. దీంతో.. సమస్య పరిష్కృతమై.. మరో రెండ్రోజుల్లో విద్యుదుత్పాదన ప్రారంభం కానుంది.