Sridhar Babu: ‘ఏఐ’ సహిత సమగ్ర హెల్త్ ప్రొఫైల్
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:59 AM
కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా రూపొందిస్తాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, బంజారాహిల్స్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్ మాడ్యూర్ హాస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండీఆర్.మై డిజి రికార్డ్’ మొబైల్ యాప్ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో వ్యాధిగ్రస్తులు ముందుగా ఒక ఆస్పత్రికి వెళ్తున్నారు. అన్ని వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకుంటున్నారు.
నమ్మకం కుదరక మళ్లీ ఇంకో ఆస్పత్రికి వెళ్తున్నారు. అక్కడా మళ్లీ అన్ని వైద్య పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. ఫలితంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వచ్చాక రోగులపై పడే అదనపు భారం తగ్గుతుంది. వేగంగా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులకు సాయపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి వీలవుతుందని చెప్పారు. హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఏఐ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచేలా రూపొందిస్తామని తెలిపారు.