Share News

Singareni: విపత్తుపై నారి!

ABN , Publish Date - Jul 06 , 2025 | 05:02 AM

సింగరేణి సంస్థ తన 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ పరిధిలోని వివిధ పాంతాల్లో నిరుడు ఉద్యోగాల్లో చేరిన 13 మంది యువతులకు పెద్దపల్లి యైుటింక్లయిన్‌ కాలనీలో 14 రోజులపాటు కఠోర శిక్షణిచ్చింది.

Singareni: విపత్తుపై నారి!

  • సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ బృందం

  • 13 మంది యువతులకు శిక్షణ పూర్తి

  • 14 రోజుల పాటు క్లాసుల నిర్వహణ

  • ధ్రువీకరణ పత్రాలు అందజేసిన సీఎండీ

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ తన 136 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళా రెస్క్యూ బృందాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ పరిధిలోని వివిధ పాంతాల్లో నిరుడు ఉద్యోగాల్లో చేరిన 13 మంది యువతులకు పెద్దపల్లి యైుటింక్లయిన్‌ కాలనీలో 14 రోజులపాటు కఠోర శిక్షణిచ్చింది. బొగ్గు గనుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అక్కడ ఊపిరాడని పరిస్థితిలో చిక్కుకుపోయే కార్మికులను బయటకు తీసుకురావడం, వారికి సీపీఆర్‌ చేయడం, ప్రాథమిక చికిత్స అందించడం, తదితర అంశాలపై యువతులకు శిక్షణనిచ్చారు. శనివారం వారికి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.బలరామ్‌ చేతుల మీదుగా ధ్రువీకరణపత్రాలను అందజేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థానాల్లో జరిగే రెస్క్యూ పోటీల్లో కూడా పాల్గొని సింగరేణికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. తమకు లభించిన శిక్షణపై బృందంలోని యువతులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనాలనే ఆసక్తితోనే తాము శిక్షణ పొందామని, అందులో భాగంగా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదంలో చిక్కుకున్న వారిని బ్రీతింగ్‌ ఆపరేటర్స్‌తో ఎలా కాపాడాలో నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో వారు ప్రత్యేకంగా మాట్లాడారు.


తొలి త్రైమాసికంలో వందశాతం బొగ్గు రవాణా: ఎన్‌.బలరామ్‌

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బొగ్గు రవాణాలో 100 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం లక్ష్యాలను సాధించామని సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో అన్ని ఏరియాల్లోని జీఎంలతో త్రైమాసిక ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బలరామ్‌ మాట్లాడుతూ జూలై నెలకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించేందుకు రోజుకు 2.15 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 1.80 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలని ఆదేశించారు. కొత్తగూడెంలో అన్ని అనుమతులు మంజూరైన వీకే ఓపెన్‌ కాస్ట్‌ గని భూమిపూజ ఈ నెలాఖరులో నిర్వహించాలని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా ఇల్లందు మైనింగ్‌ ప్రాంతంలోనే బీటెక్‌ పూర్తిచేసి టీసీఎ్‌సలో మూడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశాను. ఏదో కొత్తగా చేయాలనే సంకల్పంతో నిరుడు సింగరేణిలో చేరాను. మైనింగ్‌ అంటే అబ్బాయిలు మాత్రమే చేయగలరని కొంతమంది అంటుంటే విని..మేమూ ఎందులో తక్కువ కాదని అనిపించేది. సింగరేణి రెస్య్కూ బృందంలోచేరి ప్రమాదంలో ఉన్నవాళ్లను ఎలా రక్షించాలో తెలుసుకున్నాను.

-షేక్‌ ఆసియా బేగం, ఇల్లందు, ఖమ్మం

ఇతరులకు సాయం చేసే లక్ష్యంతోనే..

నా చిన్నతనం నుంచి ఇతరులకు సాయం చేయడం అలవాటు. అయితే ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలంటే ముందుగా మనం ఆ ప్రమాదంలో పడకుండా ఉండటం, వారిని రక్షించి, బయటపడటం ఎలానో తెలిసి ఉండాలి. సింగరేణి మొదటిసారిగా మహిళలతో రెస్య్కూ బృందాలు ఏర్పాటుచేస్తుందని తెలియగానే బృందంలో చేరాను.

-చందనా జవేరి, గూడూరు, మహబూబాబాద్‌


కఠిన శిక్షణలో ధైర్యంగా యువతులు

ఇప్పటి వరకు ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన మహిళా ఉద్యోగులకు రెస్య్కూ ఆపరేషన్స్‌పై శిక్షణ అందించాం. మొదటిసారి సింగరేణిలో 58 మంది మహిళలను ఎంపిక చేసి వారిలో 36 మందిని రెస్య్కూ బృందంలో శిక్షణ కల్పిస్తాం. మొదటి బ్యాచ్‌లో 13 మంది మహిళలకు 15 రోజుల పాటు బ్రీతింగ్‌ అపరేషన్స్‌, లిఫ్టింగ్‌ బ్యాగ్‌, హైడ్రాలిక్‌ స్పెడ్డర్స్‌, రోప్‌ రెస్య్కూలపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించాం. పెద్దపల్లిలోని ఐట్‌ ఇన్‌క్లీన్‌ కాలనీలో రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించిన కఠినమైన శిక్షణలో మహిళలు ఎంతో ధైర్యంగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్నారు.

-మోడం తిరుపతి, రెస్క్యూ ఇన్‌ స్పెక్టర్‌


సవాలుగా తీసుకొని పనిచేయడం ఇష్టం

మైనింగ్‌లో మహిళలూ పనిచేయగలరని చాటేందుకే నేను దీన్నో సవాలుగా తీసుకొని సింగరేణి ఉద్యోగంలో చే రాను. 2019లో బీటెక్‌ మైనింగ్‌ పాసై ఐదేళ్లు ప్రైవేట్‌ కంపెనీలో పనిచేశాను. గత ఏడాది సింగరేణిలో ఉద్యోగంలో చేరాను. ప్రమాదంలో పనిచేయడం ఎంత కష్టమో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడమూ అంతే కష్టం. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటా.

-సీహెచ్‌ రమ్య, సోమాపల్లి, కొత్తగూడెం

Updated Date - Jul 06 , 2025 | 05:02 AM