Seethakka: బీఆర్ఎస్ నేతలే సిగ్గుపడాలి!
ABN , Publish Date - Jun 28 , 2025 | 03:56 AM
గత పదేళ్ల పాలనలో ఆదివాసీలకు, ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆనాడు ఆదివాసీలపై దాడులు జరిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.
మావోయిస్టుల లేఖను అడ్డుపెట్టుకొని ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేశారు
పదేళ్ల పాలనలో వారు చేసిందేం లేదు
ప్రజాసేవకే నా జీవితం అకింతం: సీతక్క
ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన పంచాయతీ రాజ్ మంత్రి
ములుగు/మంగపేట/చర్ల, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): గత పదేళ్ల పాలనలో ఆదివాసీలకు, ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమి లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆనాడు ఆదివాసీలపై దాడులు జరిగినా పట్టించుకోని నేతలు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. మావోయిస్టుల లేఖను అడ్డుపెట్టుకుని ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు. అసలు ఆ లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా.. లేదా.. అన్నదానిపై స్పష్టత లేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పోడు సమస్యను ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. శుక్రవారం ములుగు జిల్లాలోని మంగపేట, ములుగు, ఏటూరునాగారం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు సీతక్క శంకుస్థాపన చేశారు.
ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీలోనూ పాల్గొన్నారు. చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల్లో సీతక్క మాట్లాడుతూ.. ‘నన్ను ఎన్నికల్లో ఓడించాలని ఎన్నో శక్తులు పనిచేశాయి. అవే శక్తులు ఇప్పుడూ నన్ను టార్గెట్ చేస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. 49 జీవోతో ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. జీవో రద్దుకు తీర్మానం పెట్టించామన్నారు. తానూ ఆదివాసీ బిడ్డనేనని, ఆదివాసీల జీవనాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని చెప్పారు. అక్కడక్కడ కొందరు అటవీ అధికారులు దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని.. వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. తాను ప్రజల మనిషినని.. నిరంతరం ప్రజా సేవకే అంకితమై వారికి అండగా ఉంటానని తెలిపారు.