Share News

దేశంలో రాజ్యహింస అవధులు దాటింది

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:53 AM

ఫాసిజం దేశంలో నలుమూలలా విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండ్రోజులుగా కొనసాగిన విప్లవ రచయిత సంఘం (విరసం) 24వ సాహిత్య పాఠశాల కార్యక్రమాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి.

దేశంలో రాజ్యహింస అవధులు దాటింది

  • రెండో రోజు విరసం సాహిత్య పాఠశాలలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఫాసిజం దేశంలో నలుమూలలా విస్తరించిందని, తద్వారా రాజ్యహింస అవధులు దాటిందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కల్యాణ మండపంలో రెండ్రోజులుగా కొనసాగిన విప్లవ రచయిత సంఘం (విరసం) 24వ సాహిత్య పాఠశాల కార్యక్రమాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఇటీవల దివంగతులైన కవి, విప్లవ మేధావి ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా స్మృతిపథంలో, సాయిబాబా ప్రాంగణంగా.. ‘సంక్షోభ కాలంలో సాహిత్యకారుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన ఈ కార్యక్రమాల ముగింపు బహిరంగ సభలో ముఖ్యవక్తగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడారు. రచయితల దృక్పథంలో మార్పు రావడం కాదని, ప్రవర్తనలో మార్పు రావాలని అన్నారు.


భారతీయ సమాజంలో అంబేడ్కర్‌ తర్వాత గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తిగా వరవరరావు కనపడతారని, సాహిత్యంలో ప్రధాన భూమిక పోషించి ఉంటే ఆయనకు జ్ఞానపీఠ్‌ పురస్కారం వచ్చేదని చెప్పారు. విప్లవోద్యమం నిర్మించేవారంతా ఎప్పుడూ విలువలు, నిజాయితీ, త్యాగాలు ఆచరణలో చూపేవారని... దీనికి ఉదాహారణ ప్రొఫెసర్‌ సాయిబాబా అని అన్నారు. ఇటీవల కాలంలో రచయితలు ప్రజలకు దగ్గరయ్యే సాహిత్యాన్ని సృష్టిస్తున్నారని, ఇది ఆశాజనకంగా భావిస్తున్నానని చెప్పారు. విరసం నాయకుడు నాగేశ్వరాచారి అధ్యక్షత వహించిన ఈ సభకు ముందు విరసం నాయకులు 27 పుస్తకాలు ఆవిష్కరించారు. విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి రివేరా, సాయిబాబా సహచరి వసంతకుమారి, వీక్షణం సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌, పాణి, ఎన్‌.రవి, వరలక్ష్మి, సాగర్‌, శశికళ పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 04:53 AM