Narendra Kumar: ముఖ హాజరుతో ఆందోళన వద్దు : డీఎంఈ
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:41 AM
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మే 1 నుంచి అమల్లోకి వచ్చే ముఖ హాజరు విధానంపై భయాందోళనలు వద్దని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మే 1 నుంచి అమల్లోకి వచ్చే ముఖ హాజరు విధానంపై భయాందోళనలు వద్దని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఎన్ఎంసీ ఈ నెల 16న ముఖ హాజరుకు సంబంధించి ఒక సర్క్యులర్ విడుదల చేసిందని, బయోమెట్రిక్ స్థానంలో దీన్ని తీసుకువస్తున్నట్లు వెల్లడించిందని పేర్కొన్నారు.
ఈ విధానంలో వైద్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగదని తెలిపారు. కొన్ని వైద్య కళాశాలల్లో ఘోస్ట్ ఫ్యాకల్టీ, సిలికాన్ థంబ్, డూప్లికేషన్ ఫ్యాకల్టీని చూపిస్తున్నారని, దీన్ని నివారించేందుకే ముఖ హాజరు విధానాన్ని తీసుకొస్తున్నారని వివరించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు మన వద్ద కూడా ముఖ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఫేస్ అటెండెన్స్పై అధ్యాపకులు అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు.