Armoor crime: అనుమానంతో భార్యను చంపిన భర్త
ABN , Publish Date - May 20 , 2025 | 05:29 AM
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గంగాధర్, ఆర్మూర్లో ఇద్దరు కుమార్తెల కళ్లెదుటే ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది; పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కూతుళ్ల ఎదుటే.. కత్తితో గొంతు కోసి దారుణ హత్య
ఆర్మూర్ టౌన్, మే 19 (ఆంరధజ్యోతి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తన కూతుళ్ల కళ్లెదుటే ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో సోమవారం జరిగింది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్కు జగిత్యాల జిల్లా మొగిలిపేట్కు చెందిన అంజలితో 18 ఏళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గంగాధర్ జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్లుగా దుబాయి వెళ్లొస్తుండేవాడు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో.. అనుమానం అనే పెనుభూతం ప్రవేశించింది. భార్యపై అనుమానంతో ఐదేళ్లుగా గంగాధర్ గొడవ పడుతుండడంతో.. దంపతులిద్దరూ తమకు విడాకులు కావాలంటూ బోధన్ కోర్టులో దాఖలు చేసుకున్నారు. కూతుళ్ల చదువు నిమిత్తం అంజలి ఆర్మూర్ పట్టణంలో నివాసం ఉంటోంది. గంగాధర్ నెల రోజుల క్రితం దుబాయి నుంచి వచ్చి విడాకుల విషయమై.. సోమవారం బోధన్ కోర్టుకు హాజరుకావాలని అంజలికి ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో పిల్లలతో కలిసి బోధన్కు బయలుదేరిన అంజలిని మార్గంమధ్యలో నిజామాబాద్ బస్టాండ్లో గంగాధర్ కలిశాడు. ఇప్పుడు కోర్టుకు అవసరం లేదని, తిరిగి వెళ్లిపోవాలని చెప్పి ఆమెకు తెలియకుండా అనుసరిస్తూ ఆర్మూర్కు వెళ్లాడు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి అంజలిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన ఇద్దరు కూతుళ్లను తోసివేసి.. వారి కళ్లెదుటే భార్య గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. పిల్లల అరుపులు విన్న ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య, ఏఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి