Nizamabad: చికిత్స చేయకుండా ఆస్పత్రి షెడ్డులో వదిలేసి!
ABN , Publish Date - Jun 26 , 2025 | 03:37 AM
తనవాళ్లంటూ ఎవ్వరూ లేని ఆ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఎవరో పెద్ద మనసుతో స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు.
తీవ్రంగా గాయపడిన వృద్ధురాలి పట్ల నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి వైద్యుల అమానుషం
జిల్లా కలెక్టర్ సీరియస్.. మెరుగైన చికిత్సకు ఆదేశాలు
నిజామాబాద్ అర్బన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తనవాళ్లంటూ ఎవ్వరూ లేని ఆ వృద్ధురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడితే ఎవరో పెద్ద మనసుతో స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు! వైద్యులు మాత్రం బాధితురాలికి నామమాత్రంగా వైద్యం చేసి ఆస్పత్రి ఆవరణలో వదిలేశారు! సరైన వైద్యం అందకపోవడం వల్ల ఆ అభాగ్యురాలి పరిస్థితి మరింత విషమంగా మారింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. ఆర్మూర్ మండలం పెర్కిట్కు చెందిన బుజ్జమ్మ (65) మంగళవారం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. గ్రామానికి చెందిన పలువురు అదే రోజు ఆమెను నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడి సిబ్బంది ఆమె గాయాల వద్ద కట్లు కట్టి ఆస్పత్రి ఆవరణలోని ఓ రేకుల షెడ్డులో వదిలేశారు. సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ప్రతినిధులు బుధవారం వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా బుజ్జమ్మ అపస్మారక స్థితిలో పడి ఉంది. విషయాన్ని వారు నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకొని బుజ్జమ్మ పరిస్థితిపై ఆరా తీశారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. రోగులకు చికిత్స చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.