Milla Maggi: అందాల పోటీల్లో వేశ్యలా..
ABN , Publish Date - May 25 , 2025 | 04:50 AM
హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు గతంలోలాగా కాకుండా భిన్నంగా ఉంటాయని అనుకున్నానని.. కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు.
నన్ను అలాగే చూసినట్టు అనిపించింది.. పురుష స్పాన్సర్లతో కలిసి ఉండాలన్నారు
24 గంటల పాటు మేక్పలో ఉండాలని, బాల్ గౌన్లు ధరించాలని ఒత్తిడి చేశారు
మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలు.. పోటీ నుంచి తప్పుకొన్నట్టు ప్రకటన
ఆరోపణలు నిరాధారం.. తల్లికి బాగోలేదని చెప్పి వెళ్లిపోయారు: జూలియా మోర్లే
చేనేత వస్త్రాల్లో.. మరింత అందంగా.. అందాల భామల ర్యాంప్ వాక్
ఘనంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే.. ఆసియా-ఓషియానా విజేతగా నందిని
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. మిస్ వరల్డ్ పోటీలు గతంలోలాగా కాకుండా భిన్నంగా ఉంటాయని అనుకున్నానని.. కానీ కోతుల ప్రదర్శనలా కూర్చోవాల్సి వచ్చిందని చెప్పారు. పోటీలకు స్పాన్సర్ చేస్తున్న మధ్య వయసు పురుషులతో కలివిడిగా మెలగాలని, వారితో కూర్చొని మాట్లాడాలని పోటీల నిర్వాహకులు ఒత్తిడి తెచ్చారని.. తనను వేశ్యలా చూస్తున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించారు. అందుకే మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకొన్నానని పేర్కొన్నారు. బ్రిటన్కు చెందిన ‘ది సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. ‘‘నిజానికి నేను మంచి చేయాలని, మార్పు తీసుకురావాలని పోటీల్లో పాల్గొనడానికి వెళ్లాను. రొటీన్కు కాస్త భిన్నంగా ఉండాలనుకున్నాను. కానీ ఇక్కడ అలాంటిది జరగలేదు. మేం ప్రదర్శనలో కోతుల్లా కూర్చోవాల్సి వచ్చింది. ఈ పోటీ ఇంకా పాతకాలంలోనే ఉండిపోయింది. నైతికంగా ఇలాంటి వాటిలో నేను భాగస్వామ్యం కాలేను. నేను వినోదాన్ని పంచడానికి రాలేదు. పోటీదారులంతా 24 గంటల పాటు మేక్పలో ఉండాలని, రోజంతా బాల్ గౌన్లను ధరించే ఉండాలని నిర్వాహకులు చెప్పారు.
ఉదయం అల్పాహారం సమయంలోనూ అలాగే ఉండాలన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్ చేసిన మధ్య వయసు పురుషులకు కృతజ్ఞత చూపాలని, వారితో కలివిడిగా ఉండాలని చెప్పారు. ఒక్కో టేబుల్ వద్ద ఆరుగురు అతిథులతో ఇద్దరు చొప్పున పోటీదారులను కూర్చోబెట్టారు. గంటలకు గంటలు వారిని అలరిస్తూ కూర్చోవాలి. ఇలా చేయడాన్ని నేను నమ్మలేకపోయాను. నేను వారిని అలరించడానికి ఇక్కడికి రాలేదు. ముమ్మాటికీ అది తప్పుడు విధానం. నన్ను ఒక వేశ్యలా చూస్తున్నట్టు అనిపించింది. ‘బ్యూటీ విత్ పర్పస్’ కింద నేను ఎంచుకున్న అంశాన్ని వివరించేందుకు ప్రయత్నించాను. కానీ టేబుల్ వద్ద ఉన్న పురుషులెవరూ పట్టించుకోలేదు. ఏవో సరదా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మిస్ వరల్డ్ అధికారుల్లో ఒకరు నేను చెబుతుంటే విసిగిస్తున్నానని (బోరింగ్) అన్నారు. చాలా అగౌరవంగా అనిపించింది. ‘బ్యూటీ విత్ పర్పస్’ అన్న భావనే లేకుండా పోయింది. మిస్ వరల్డ్ పోటీలు మారాల్సి ఉంది’’ అని మిల్లా మాగీ పేర్కొన్నారు. ఆమె ఈ నెల 16వ తేదీనే పోటీల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించి, ఇంగ్లండ్కు వెళ్లిపోయారు. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో ఇలా మిస్ ఇంగ్లండ్ తప్పుకోవడం ఇదే మొదటిసారి.
తల్లి ఆరోగ్యం బాగోలేదని వెళ్లిపోయారు
మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈఓ జూలియా మోర్లే ఖండించారు. తన తల్లి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేదని, పోటీల నుంచి విరమించుకుని వెళ్లిపోతానని మిల్లా మాగీ కోరారని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పరిగణించి.. వెంటనే ఆమెను ఇంగ్లండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేశామని తెలిపారు. మిల్లా మాగీ తప్పుకొన్నాక మిస్ ఇంగ్లండ్ రన్నరప్ షార్లెట్ గ్రాంట్ ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకొచ్చారని.. ఆమె బుధవారమే భారత్కు చేరుకున్నారని చెప్పారు. కానీ మిల్లా మాగీ వ్యాఖ్యలు, దానిపై ప్రచురితమైన కథనాలు నిరాధారమని తప్పుపట్టారు. పోటీల ప్రారంభ సమయంలో మిల్లా మాగీ.. మిస్ వరల్డ్ పోటీలపై ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేసిన వీడియో క్లిప్లను జూలియా మోర్లే విడుదల చేశారు. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’, నిజాయతీ, గౌరవమనే విలువలతో పోటీలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..