అండర్గ్రౌండ్లో 88 మందే!
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:10 AM
వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తగ్గిపోతున్న మావోయిస్టుల సంఖ్య
ప్రస్తుతం ఏవోబీ, ఛత్తీస్గఢ్లోనే కదలికలు
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం అండర్గ్రౌండ్లో ఉన్నవారు 88 మందేనని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వారిలోనూ చాలా వరకు ఆంధ్రా ఒడిషా సరిహద్దు (ఏవోబీ), ఛత్తీ్సగఢ్ సరిహద్దుల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తున్నారనని, రాష్ట్రంలో వారి కదలికలు చాలావరకు తగ్గిపోయాయని పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అంతం చేస్తామంటూ ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత.. తెలంగాణ సరిహద్దుల్లోనూ విస్తృతంగా గాలింపు చర్యలు (కూంబింగ్) చేపట్టింది.
ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవలి ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడెల్లి అలియాస్ భాస్కర్ మరణించారు. మరికొందరు రాష్ట్ర కమిటీ నాయకులు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారని పౌరహక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఇక ఇటీవల పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య తగ్గిపోతోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.