Manda Krishna: ప్రజలు, మేధావుల మద్దతు మాదిగలకే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:41 AM
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నా యకుల మద్దతుతో పాటు ప్రజల మద్దతూ మాదిగలకే ఉన్నా.. 30 ఏండ్ల పోరాటానికి మాలలు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

ఫిబ్రవరి 7న హైదరాబాద్కు తరలిరావాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
తొర్రూరు(మహబూబాబాద్ జిల్లా), జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నా యకుల మద్దతుతో పాటు ప్రజల మద్దతూ మాదిగలకే ఉన్నా.. 30 ఏండ్ల పోరాటానికి మాలలు అడ్డుపడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించే వెయ్యి గొంతుకలు, లక్ష డప్పుల సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం తొర్రూరులో డప్పు కళాకారులతో ర్యాలీ, సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలమైనా కొంతమంది ఆ పార్టీలో ఉన్న మాల నాయకులు వ్యతిరేకమని, వారి మూలంగానే తెలంగాణలో వర్గీకరణ అమలు ఆగుతుందని ఆరోపించారు. వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరిందని, ఈ ఆఖరి పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, మేధావుల పూర్తి మద్దతు ఉందని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి వర్గీకరణ అమలులో జాప్యం చేయవద్దని ఆయన కోరారు.