Mahesh Kumar Goud: మావోయిస్టులపై మారణహోమం ఆపాలి
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:14 AM
మావోయిస్టులపై మారణ హోమం నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
మోదీ, అమిత్ షాకు మానవత్వం లేదు
కార్పొరేట్లకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకే ‘కగార్’
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఆపరేషన్ కగార్ నిలిపివేతకు 14న లెఫ్ట్ పార్టీల ధర్నా
మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీఆర్ఎస్
హైదరాబాద్ సిటీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులపై మారణ హోమం నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆదివారం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు కనీస మానవత్వం కూడా లేదని విమర్శించారు. ఛత్తీ్సగఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆదివాసీలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం పూనుకున్నదని ఆరోపించారు. మావోయిస్టు సిద్ధాంతాలను తాను అంగీకరించకపోయినా, సమ సమాజ స్థాపన కోసం సర్వం తాగ్యం చేసిన నంబాల కేశవరావు మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తులను చంపగలరే గానీ, సిద్ధాంతాలను నిర్మూలించలేరని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. శాంతి చర్చల కమిటీ చేపట్టే కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని మహేశ్ చెప్పారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ను ట్రంప్ జోక్యంతో నిలిపిన వారు దేశ పౌరులపై మారణ హోమం సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ మార్గంలోనే ఈ సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్కు తమ పార్టీ వ్యతిరేకమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేత కోరుతూ దేశంలోని ఆదివాసీ, దళిత, ప్రతిపక్ష ఎంపీలకు లేఖలు రాద్దామని ప్రతిపాదించగా, సభికులంతా అంగీకారం తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపేయడంతోపాటు శాంతి చర్చలు జరుపాలని కోరుతూ 14న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేపట్టాలని వామపక్ష పార్టీల తీర్మానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశానికి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షత వహించారు.
చితాభస్మాన్నీ ఇవ్వలేదు
నంబాల కేశవరావు మృతదేహం ఇవ్వడానికి నిరాకరించిన కేంద్రం.. చివరకు ఆయన చితాభస్మాన్ని కూడా కుటుంబ సభ్యులు తీసుకోవడాన్ని నిరాకరించడం అమానుషమని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సదస్సులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. ‘సాయుధ విప్లవ పోరాటం- శాంతి చర్చలు’ అనే అంశంపై జరిగిన సదస్సును సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ ప్రారంభిస్తూ రాజ్యం హద్దులు దాటినప్పుడు పౌర సమాజం గళం విప్పాలని హితవు చెప్పారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ లా, ప్రొస్ట్గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..
మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..