Ramchander Rao: డిప్యూటీ సీఎం భట్టికి లీగల్ నోటీసు..
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:09 AM
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు
కాంగ్రెస్వి రిజర్వేషన్ రాజకీయాలు
రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి వ్యాఖ్యల మీద రాంచందర్రావు అభ్యంతరం
3 రోజుల్లో క్షమాపణ చెప్పాలి
లేదంటే క్రిమినల్ కేసు ఎదుర్కోవాలని హెచ్చరిక
బీసీల ఓటు బ్యాంకు కోసం నాటకాలు.. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
అత్యధిక జడ్పీల్లో గెలుపే లక్ష్యం : కిషన్రెడ్డి
హైదరాబాద్/ఘట్కేసర్ రూరల్/కోదాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరుతో ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రిజర్వేషన్ నాటకమాడుతోందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలపాలని చూస్తోందని.. ఇది బీసీలకు వ్యతిరేక చర్య అని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ గతంలోనే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మునిసిపాలిటీ పరిధిలోని అవుశాపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత కోసం మంగళవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాంచందర్రావు మా ట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే, కాంగ్రెస్ సర్కారు కూడా అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేశాయని మండిపడ్డారు. పార్టీ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు కదలాలంటే నాయకులు కలిసికట్టుగా ముందు కెళ్లాలన్నారు.
బీజేపీ ప్రభుత్వం రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉందని, ఇప్పుడు కూడా పార్టీ సిద్ధం కాకపోతే పొరపాటు నాయకులదేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 18 నుంచి 20 వరకు జిల్లా స్థాయి, 21 నుంచి 23 వరకు మండల స్థాయి వర్క్షాప్లు. 25, 26 తేదీల్లో పోలింగ్ బూత్ బైఠక్లు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. అత్యధిక జిల్లా పరిషత్లు కైవసం చేసుకునేందుకు పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు. సమష్టిగా పని చేసి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటుదామని పార్టీ నేతలకు ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. కొత్త,పాత అన్న తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉం దని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న వారినే ప్రజలు గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత దూషణలు సరికాదు
రాజకీయ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని రాంచందర్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
భట్టికి రాంచందర్రావు లీగల్ నోటీసు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు లీగల్ నోటీసు ఇచ్చారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి చేసిన వ్యాఖ్యలను రాంచందర్రావు తీవ్రంగా పరిగణించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు 3రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రూ.25 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.