Bhukya Sanjeev Naik: లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:54 AM
ఎస్టీలలో అత్యధిక జనాభా కలిగిన లంబాడీ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు.
సేవాలాల్ సేన అధ్యక్షుడు భూక్య సంజీవ్
పంజాగుట్ట, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఎస్టీలలో అత్యధిక జనాభా కలిగిన లంబాడీ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపునకు ఎంతో కృషి చేశామని, అధికారంలోకి వచ్చిన తరువాత తమను విస్మరించడం సరికాదని అన్నారు.
తమ సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, నామినేటెడ్ పదవులలో కూడా సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, తమ గురువు హాథిరామ్ బావాజీకి చెందిన ఆస్తులను పరిరక్షించాలన్నారు. తిరుపతిలోని హాథిరామ్ మఠం పీఠాధిపతిగా లంబాడీని నియమించాలని డిమాండ్ చేశారు. హాథిరామ్ బావాజీ జయంతి సందర్భంగా ఈనెల 29, 30 తేదీలలో చలో తిరుపతికి ఆయన పిలుపునిచ్చారు.