స్పెషల్ ’బాదుడు‘
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:15 AM
మహాకుంభమేళాకు తరలి వెళుతున్న భక్తుల జేబులకు రైల్వేశాఖ చిల్లుపెడుతోంది. సాధారణ రైళ్లతో పోల్చితే ప్రత్యేక రైళ్లకు టికెట్ ధర 13నుంచి 20ు వరకు అదనంగా వసూలు చేస్తోంది.

మహాకుంభమేళా భక్తుల జేబులకు రైల్వేశాఖ కత్తెర
ప్రత్యేక రైళ్లకు అదనంగా 25 శాతం వసూళ్లు
హైదరాబాద్ సిటీ, జనవరి30(ఆంధ్రజ్యోతి): మహాకుంభమేళాకు తరలి వెళుతున్న భక్తుల జేబులకు రైల్వేశాఖ చిల్లుపెడుతోంది. సాధారణ రైళ్లతో పోల్చితే ప్రత్యేక రైళ్లకు టికెట్ ధర 13నుంచి 20ు వరకు అదనంగా వసూలు చేస్తోంది. దే శవ్యాప్తంగా భక్తుల కోసం మొత్తం 3,100 ప్రత్యేక రైళ్లు నడుపుతుండగా, దక్షిణమధ్యరైల్వే పరిధిలో 181 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నగరంలోని వివిధ టెర్మినల్స్ నుంచి ప్రారంభమవుతున్నాయి. కుంభమేళాకు రెగ్యులర్ రైళ్లలో వెళుతున్న ప్రయాణీకులు చెల్లించిన టికెట్ ధరతో పోల్చితే ప్రత్యేక రైళ్లలో వెళుతున్న ప్రయాణీకులపై ఎక్కువ భారం పడుతోంది.
13నుంచి 20ు వరకు అదనం
సికింద్రాబాద్ నుంచి దానాపూర్కు వెళ్లే రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైల్లో స్లీపర్ క్లాస్కు టికెట్ ధర రూ.745, త్రీటైర్ ఏసీ రూ.1,945, టూటైర్ ఏసీ టికెట్ ఽచార్జీ రూ.2,805లుగా ఉంది. కాగా, ప్రత్యేకరైళ్లలో మాత్రం టికెట్ ధరలు స్లీపర్క్లాస్ రూ.885, త్రీటైర్ ఏసీ రూ.2,250, టూటైర్ ఏసీ రూ.3,155గా నిర్ణయించారు. దీంతో ఆయా తరగతుల ప్రయాణీకులకు వరుసగా రూ.140, రూ.305, రూ.350లు అదనపు భారం పడుతోంది. రానుపోను టికెట్ ధరలకు, రిజర్వేషన్ చార్జీలు కూడా కలిపితే.. భారీ వ్యత్యాసం ఉంటోంది. యాత్రికులపై అదనపు భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల ప్రతినిధులు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.