KTR: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది: కేటీఆర్
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:03 PM
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 31: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో పలువురు ఎంఐఎం నాయకులకు కండువా కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.
కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని.. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
Azharuddin: ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజారుద్దీన్
Mahesh Kumar Goud: కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్..