KTR: కాంగ్రెస్ పాలనలో ఎరువులకూ కరువే..!
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:27 AM
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని.. రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు ఎరువులకు కూడా తీవ్రమైన కరువు ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఎరువులను బుక్కేస్తున్న మేతన్నలెవరో తేల్చాలి: కేటీఆర్
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని.. రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు ఎగ్గొట్టడమే కాకుండా ఇప్పుడు ఎరువులకు కూడా తీవ్రమైన కరువు ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అప్పుతెచ్చి వ్యవసాయం చేద్దామన్నా.. కనీసం ఒక ఎరువుల బస్తా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకు ఉందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రూ.266కు అందుబాటులో ఉండాల్సిన యూరియా బస్తా ధర ఇప్పుడు రూ.325కు చేరిందని, ఇందుకు కారణం ఏమిటని నిలదీశారు. కృత్రిమ కొరత సృష్టించి.. ఆఖరికి ఎరువులను కూడా బుక్కేస్తున్న మేతన్నలు ఎవరో తేల్చేందుకు తక్షణం విచారణ జరిపించాలని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.