KTR: కాంగ్రెస్ స్కాంలపై కేంద్రం మౌనమెందుకు?
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:51 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంలకు పాల్పడుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సాక్ష్యాధారాలతో తాము ఫిర్యాదు చేసినా మౌనంగా ఎందుకు ఉంటోందని ఆయన ప్రశ్నించారు.

రేవంత్కు బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోంది: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాంలకు పాల్పడుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సాక్ష్యాధారాలతో తాము ఫిర్యాదు చేసినా మౌనంగా ఎందుకు ఉంటోందని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని, పరోక్షంగా కాపాడే యత్నం చేస్తోందన్నారు. సరైన సమయంలో రేవంత్ బీజేపీలో చేరతానని హామీ ఇవ్వడంవల్లే కేంద్రం ఆయన్ను కాపాడుతుందన్న అనుమానం కలుగుతోందన్నారు.
ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపై ఆగమేఘాలమీద స్పందించిన కేంద్రం.. సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ప్రమాదంతోపాటు తాజాగా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన పెను ప్రమాదాలపై కనీసం స్పందించడంలేదని కేటీఆర్ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన రూ.1337 కోట్ల కేంద్ర పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ నిధులను రేవంత్ తన సొంత బావమరిదికి కట్టబెడుతూ అమృత్ పథకంలో స్కాం వివరాలను తానే వెళ్లి సాక్ష్యాలు అందించినా కేంద్రం స్పందించడం లేదని ఆరోపించారు.