Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ల వల్లే దీనంగా మెడికల్ కాలేజీలు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:11 AM
తెలంగాణలోని వైద్య కళాశాలల దీనస్థితికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
న్యూఢిల్లీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని వైద్య కళాశాలల దీనస్థితికి గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మెడికల్ కాలేజీల్లో కనీస వసతులు కల్పించక పోవడం సిగ్గుచేటని అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వసతులు కల్పించకుండా మోసగించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య కళాశాలలకు కనీసం కొత్త కుర్చీలు, బెంచీలు కూడా సమకూర్చలేదని ఆయన ఎద్దేవా చేశారు.
మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం కావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఆరోగ్యం, విద్యా రంగాలు పతనావస్థకు చేరుకున్నాయని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.