Kavitha: మేం ‘పింక్ బుక్’ పెడతాం!
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:56 AM
‘బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోంది. మేం కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

అందరి లెక్కలు రాసి.. అధికారంలోకి రాగానే అంతకంతా తిరిగి చెల్లిస్తాం: ఎమ్మెల్సీ కవిత
జనగామ/యాదాద్రి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెడుతోంది. మేం కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. అధికారంలోకి రాగానే అంతకు అంతా తిరిగి చెల్లిస్తాం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గురువారం ఆమె జనగామ, పెంబర్తి, భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. తాము కూడా అందరి లెక్కలు రాసి పెట్టుకుంటున్నామని, తమకు ఉద్యమం ఎలా చేయాలో, లెక్కలు ఎలా రాసుకోవాలో జయశంకర్ నేర్పించారన్నారు. అక్రమ కేసుల నుంచి తమ కార్యకర్తలను కాపాడుకుంటామని, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లెక్కలు తీసి అంతకు అంతా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అటు రాహుల్ గాంధీకి, ఇటు రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని విమర్శించారు.
వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్లో పావలా వంతు కూడా అమలు చేయలేదని, దీనిపై ఎక్కడ నిలదీస్తారనే భయంతోనే రాహుల్గాంధీ తన ఓరుగల్లు పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరికి వ్యతిరేకంగా తీర్పు రావడం, తద్వారా స్టేషన్ఘన్పూర్లో ఉప ఎన్నిక రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో పనులకు 10 నుంచి 15 ు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.