Kaleshwaram: నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక
ABN , Publish Date - May 17 , 2025 | 04:34 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లోపాలు, వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోపు (ఈనెల 22వ తేదీ తర్వాత) నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
కేసీఆర్, హరీశ్రావును పిలవకుండానే విచారణ పూర్తి
పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం?
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి లోపాలు, వైఫల్యాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెలాఖరులోపు (ఈనెల 22వ తేదీ తర్వాత) నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై ఇప్పటికే విచారణ పూర్తయినందున నివేదికకు తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైంది. కమిషన్ ఇప్పటికే విజిలెన్స్, జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్డీఎ్సఏ) నివేదికలను పరిశీలించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది.
సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై సంబంధిత ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, సిబ్బందిని విచారించింది. దీంతో పాటు పత్రాలతో కూడిన ఆధారాలు, వివిధ సమావేశాల మినిట్స్ తనకు చేరడంతో ఇక వాటినే ఆధారం చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిషన్ నిర్ణయించింది. కాగా, విచారణకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఈటల రాజేందర్లను పిలువాలని మొదట భావించిన కమిషన్.. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో వారిని పిలువాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నివేదికను త్వరితగతిన సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించేందుకు చర్యలు చేపట్టింది.