IAS Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:40 PM
ఐఏఎస్ స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో ఆమెకు నోటీసులు అందించారు.

హైదరాబాద్: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సీయూ మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫొటోగా తేల్చారు. ఈ మేరకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు.
కాగా, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్దఎత్తున వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ మేరకు పెద్దఎత్తున ఉద్రక్తతలు చోటు చేసుకున్నాయి. దీనిపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. పదుల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగిస్తున్నారని, అక్కడున్న జీవరాశులకు ఆశ్రయం లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
చెట్ల తొలగింపునకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొంతమంది బీఆర్ఎస్ నేతలపైనా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫొటోలు రీపోస్టు చేశారంటూ తాజాగా నోటీసులు అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..
Chandanotsavam 2025: సింహాచలానికి సీఎం చంద్రబాబు వచ్చేది ఆ రోజే: మంత్రి ఆనం..