Hyderabad Woman: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. అగ్ని ప్రమాదంలో..
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:57 PM
అమెరికాలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. కూతురి మరణ వార్త తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
అమెరికాలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో తెలుగు యువతి ఉడుముల సహజా రెడ్డి ప్రాణాలు కోల్పోయింది. ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె అనుకోని విధంగా చనిపోయింది. గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల ప్రాంతంలోని గుంటూరుపల్లికి చెందిన ఉడుముల జయాకర్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. జయాకర్ రెడ్డి టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శైలజ బచ్చన్నపేట మండలంలో ఎస్జీటీగా పని చేశారు. జయాకర్ కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయింది.
జోడిమెట్లలో నివాసం ఉంటోంది. జయాకర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదవటం కోసం అమెరికాకు వెళ్లింది. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్హామ్లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉంటున్నారు.13 మందిలో ఉడుముల సహజా రెడ్డి కూడా ఉంది. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకున్న సహజారెడ్డి అక్కడికక్కడే చనిపోయింది.
అధికారులు ఆమె మరణ వార్తను జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సహజారెడ్డి మరణ వార్త తెలిసి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అమెరికాలోని భారత ఎంబసీ సహజారెడ్డి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేసింది. వారితో సంప్రదింపులు జరుపుతోంది. అవసరమైన సాయం అందిస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి
నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. పరకామణి చోరీ నిందితుడు రవికుమార్
అంపశయ్యపై 'ఇండియా' కూటమి.. ఒమర్ అబ్దుల్లా