Two Doctors Arrested in Hyd: నగరంలో మత్తు ఇంజెక్షన్ల కలకలం.. ఇద్దరు డాక్టర్ల అరెస్ట్
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:54 PM
హైదరాబాద్ చాంద్రయాణగుట్ట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల కేసులో ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఇద్దరూ కలిసి అక్రమంగా మత్తు ఇంజెక్షన్ల అమ్మకానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ కారణంగానే ఇటీవల ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతిచెందారని భావిస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: నగర పరిధిలోని చాంద్రాయణగుట్ట (ChandrayanaGutta) పరిధిలో మత్తు ఇంజెక్షన్ల (Anesthetic Injections) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా తీసుకుని ఇద్దరు డ్రైవర్లు మృతిచెందడంతో (Two People Died).. పోలీసులు విచారణ చేపట్టి ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. రోగులకు ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ మోతాదులో మత్తు ఇచ్చినందువల్లే వారు మృతిచెందినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆటోల్లోనే కుప్పకూలి మరణించడంతో.. ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా విశ్లేషించి కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై పలు ఆధారాలు సేకరించారు. రోగులకు చికిత్స చేసేందుకు వాడాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జైపాల్ రెడ్డి(Doctor Jaipal Reddy) బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్ముతున్నాడు. అతడి వద్ద నుంచి ఈ ప్రమాదకర ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో మరో ఆసుపత్రికి చెందిన ఇంకో వైద్యుడి పాత్ర కూడా ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. ఇరువురూ కలిసి అక్రమంగా అనస్తీషియా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
ఆసుపత్రుల్లో నిల్వ ఉన్న ఔషధాలను దారిమళ్లించి.. మత్తుకు అలవాటుపడిన వారికి అమ్ముతూ వ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ఇంజెక్షన్లను ఇలా బహిరంగంగా అమ్మడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు పోలీసులు.
ఇవీ చదవండి: