Share News

MP K Lakshman: మొన్న కాళేశ్వరం.. నిన్న బీఆర్ఎస్ కూలిపోయాయి: బీజేపీ ఎంపీ

ABN , Publish Date - Sep 02 , 2025 | 03:26 PM

కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ స్పందించారు.

MP K Lakshman: మొన్న కాళేశ్వరం.. నిన్న బీఆర్ఎస్ కూలిపోయాయి: బీజేపీ ఎంపీ
BJP MP K Lakshman

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ మంగళవారం న్యూఢిల్లీలో స్పందించారు. మొన్న కాళేశ్వరం కూలింది.. నిన్న బీఆర్ఎస్ పార్టీ కూలిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మూడు పిల్లర్లు కూలిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.


అయితే ఈ అంశంలో 22 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కాలయాపన చేశారో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పని చేసిన సమయంలో.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారని.. ఈ ఆధారాలు ఆ దర్యాప్తు సంస్థకు ఇచ్చి ఈ కేసు విచారణకు సహకరించాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కాగ్ సైతం ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని.. లోపాలు ఉన్నాయని చెప్పిందని ఆయన సోదాహరణగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కూడా లోపాలు ఉన్నాయని చెప్పిందన్నారు. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన తన నివేదికలో క్రిమినల్ రిఫరెన్స్ లేకుండా.. రాజకీయ, అధికారులు, కాంట్రాక్టుల పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ ఒత్తిడితో రుజువులు ఏమైనా ఇవ్వలేదా అంటూ బీజేపీ ఎంపీ సందేహం వ్యక్తం చేశారు.


ఎమ్మెల్సీ కవిత బహిరంగంగానే హరీష్ రావు , సంతోష్ అవినీతికి పాల్పడ్డారని చెప్పారన్నారు. వీరిద్దరు ఆనకొండలు అని కూడా చెప్పిందని.. అంటే అవినీతి జరిగిందని కవిత పేర్కొన్నారన్నారు. తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టారని విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు అనేక మంది యువత, ఉద్యోగులు, ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేశారని.. అలాంటి అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


బీఆర్ఎస్ రూ. కోట్లకు పడగలు ఎత్తిందని మండిపడ్డారు. కేసీఆర్‌ను బలిపశువును చేశారని కవిత అంటున్నారని.. అంటే హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతిలో కేసీఆర్ పాత్ర ఉందనుకోవాలన్నారు. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంపై నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలని.. అవినీతిపరులకు శిక్ష పడాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.


ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరున్నా వారిని శిక్షించాలని ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ సూచించారు. అయితే బీజేపీలో అవినీతి పరులకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 03:35 PM