Medical Students: గంజాయి మత్తులో మెడికోలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:09 AM
ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు.
నార్కోటిక్ పరీక్షల్లో 9 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
వారిలో ఇద్దరు అమ్మాయిలు
తల్లిదండ్రుల సమక్షంలో ఈగల్ పోలీసుల కౌన్సెలింగ్
హైదరాబాద్ సిటీ, మేడ్చల్ టౌన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రాణాలు కాపాడే వైద్యవిద్యను అభ్యసిస్తున్న మెడికోలు గంజాయి మత్తులో తూలుతున్నారు. గంజాయి విక్రయం కేసులో ఇటీవల బొల్లారం ప్రాంతానికి చెందిన అర్ఫాత్ అహ్మద్, బీదర్కు చెందిన జరీనా బేగంను పోలీసులు అరెస్టు చేశారు. వారి ఫోన్లోని కాల్డాటా ఆధారంగా వారి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వారి వివరాల కోసం ఆరా తీశారు. అర్ఫాత్ వద్ద నుంచి మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు కళాశాలలకు చెందిన 64 మంది విద్యార్థులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వారిలో 26 మంది మెడిసిటీ వైద్య కళాశాల విద్యార్థులుగా గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా 9 మంది మెడికోలకు పాజిటివ్ అని తేలింది. వారిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దీంతో వారిని డీఎడిక్షన్ సెంటర్కు పంపినట్టు తెలిపారు. మరికొంత మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. గంజాయి కొనుగోలు చేస్తున్న మెడికోలకు వారి తల్లిదండ్రులు, మెడిసిటీ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ సింగ్, హెచ్ఓడీ డాక్టర్ పవన్కుమార్ శర్మల సమక్షంలో ఈగల్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యాసంస్థల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.