HYDRAA: దశాబ్దాల సమస్యలకు గంటల్లో పరిష్కారం.. హైడ్రాకు ప్రశంసలు
ABN , Publish Date - Oct 27 , 2025 | 08:53 PM
దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడంలేదని.. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది.
హైదరాబాద్, అక్టోబర్ 27: దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడంలేదని.. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది. సోమవారం ప్రజావాణికి 52 ఫిర్యాదులందాయని పేర్కొంది. త్వరితగతిన పరిష్కారం లభిస్తున్నందువల్లే ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. చాలామంది బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారని.. మరి కొంతమంది తమ వివరాలు బయటపెట్టవద్దని అధికారులకు సూచిస్తున్నారని తెలిపింది.
కూకట్పల్లిలోని హస్మత్పేట గ్రామంలో ప్రభుత్వానికి చెందాల్సిన 10 ఎకరాలు కబ్జా చేసేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని హైడ్రా స్ఫష్టం చేసింది. తూములు మూసేసి, అలుగులు ఎత్తు పెంచడంతో చెరువు పై భాగంలో ఉన్న భూములు, లే ఔట్లు నీట మునగుతున్నాయని కొంతమంది కంప్లైట్ చేసినట్లు తెలిపింది. మరికొంత మంది చెరువుల్లో మట్టి పోసి ఎకరాలకొద్దీ కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు వివరించింది. ఈ ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ నేరుగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పజెప్పారని తెలియజేసింది.
హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు ఇలా..
శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామం పరిధిలోని సరసింహకుంట తూములు మూసేసి.. అలుగు ఎత్తు పెంచడం వల్ల ఎఫ్టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి తమ పంట పొలాలు మునిగిపోయాయని ఆ గ్రామ ప్రజలు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాలకు గురి అవుతోందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సాగర్రోడ్డులో ఉన్న యశోదనగర్ కాలనీలో శివారు ఇంటి స్థలాల వారు రోడ్డును కలిపేసుకుని దారి లేకుండా చేస్తున్నారని యశోదనగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
కూకట్పల్లి ప్రాంతంలో పరికి చెరువులో సుమారు 12 ఎకరాల మేర రాత్రికి రాత్రి మట్టిపోసి నింపుతున్నారని.. నంబరు ప్లేటు లేని వాహనాలను వినియోగిస్తున్నారని అక్కడి నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ పెద్ద చెరువులోకూడా మట్టిపోసి.. భవన నిర్మాణాలు చేపడుతున్నారని.. అడ్డుకున్న తమపై దాడి చేయడమే కాకుండా.. స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు కంప్లైంట్ చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం, హస్మత్పేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఓల్డ్ బోయిన్పల్లి నివాసులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి:
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
Harish Rao Fire On CM Revanth: కట్టింగ్ మాస్టర్గా మారిన సీఎం రేవంత్ రెడ్డి