High Court: సివిల్ వివాదాల్లో ఎందుకు తలదూరుస్తారు?
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:26 AM
సివిల్ కోర్టు చేయాల్సిన పనులన్నీ పోలీసులే చేసేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో ఎందుకు తలదూరుస్తారని ప్రశ్నించింది.
కోర్టులు చేయాల్సిన పనులను మీరే చేసేస్తున్నారు
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): సివిల్ కోర్టు చేయాల్సిన పనులన్నీ పోలీసులే చేసేస్తున్నారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదాల్లో ఎందుకు తలదూరుస్తారని ప్రశ్నించింది. ‘‘పోలీసుల కారణంగానే కక్షిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. న్యాయస్థానాలు చేసే పనులు కూడా పోలీసులే నిర్వహించాలని చూస్తున్నారు. శాంతి భద్రతలు, దర్యాప్తు కంటే గీఫ్ట్ డీడ్, విల్లు లాంటి సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడమే ఎక్కువగా కనిపిస్తోంది. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను, దావాలను ఉపసంహరించుకోమని ఎలా చెబుతారు? ఆ అధికారం పోలీసులకు ఎక్కడ ఉంది’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది.
బార్కాస్లోని ఇంటి స్థలంపై కోర్టులో ఉన్న దావాను వెనక్కు తీసుకోవాలని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్పై జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల తీరు మాత్రం మారడం లేదని వ్యాఖ్యానించింది. ఎండల్లో వచ్చిన బాధితులకు కనీసం మంచినీళ్లైనా ఇవ్వరని, చాలా ేస్టషన్లలో ఫిర్యాదు చేయడానికి పేపర్లు సహా స్టేషనరీ తెచ్చుకోవాలని చెబుతున్నారని తెలిపింది. పోలీసుల చట్టం ఏం చెబుతుందో చదువుకోవాలని, తమకు నచ్చిన విధంగా తక్షణ న్యాయం అందించాలనుకోవడాన్ని మానుకోవాలని హితవు పలికింది. తాజా పిటిషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్పై విచారణకు ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వ న్యాయవాది హామీ ఇవ్వడంతో విచారణను ముగించింది.