High Court: రాత్రి 11 తర్వాత సినిమాలు.. 16 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం ఎత్తివేత
ABN , Publish Date - Mar 02 , 2025 | 05:09 AM
రాత్రి 11 తర్వాత సినిమాలు వీక్షించేందుకు 16 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం విధించిన హైకోర్టు.. శనివారం దాన్ని ఎత్తివేసింది. పుష్ప-2 బెనిఫిట్షో సందర్భంగా చిక్కడపల్లిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అప్పట్లో ఈ నిషేధాన్ని విధించగా.
మల్టీప్లెక్స్లు, థియేటర్లకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాత్రి 11 తర్వాత సినిమాలు వీక్షించేందుకు 16 ఏళ్లలోపు పిల్లలపై నిషేధం విధించిన హైకోర్టు.. శనివారం దాన్ని ఎత్తివేసింది. పుష్ప-2 బెనిఫిట్షో సందర్భంగా చిక్కడపల్లిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అప్పట్లో ఈ నిషేధాన్ని విధించగా.. ఈ నిర్ణయం వల్ల తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంటూ.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పీవీఆర్-ఐనాక్స్ సంస్థ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాయి. శనివారం దీనిపై విచారణ జరగ్గా.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలను వినిపించారు. ‘‘అసలు వివాదం మొదలైంది బెనిఫిట్షోలు, టికెట్ల ధరల పెంపుపై. దానికి పిల్లల ప్రవేశంతో సంబంధం లేదు.
ప్రభుత్వం బెనిఫిట్, స్పెషల్ షోలకు అనుమతించడం లేదు. టికెట్ల ధరల పెంపునకూ ఆమోదం తెలపడం లేదు’’ అని వివరించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిల్లల ప్రవేశంపై అన్ని వర్గాల నుంచి సూచనలు అందాయని, అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం.. దీనిపై ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.